ఇప్పటిరోజుల్లో చాలామంది ఎండపొడ తగలకుండానే రోజు గడిపేస్తున్నారు. దీనివల్ల ఎండా ద్వారా శరీరానికి అందే విలువైన విటమిన్ డి ని కోల్పోతున్నారు. ఇలా ఏళ్ళు గడిచేకొద్దీ శరీరంలో విటమిన్ డి లోపించి పలు అనారోగ్యాలపాలవుతారు. శాఖాహారుల్లో ఈ విటమిన్ డి లోపం ఇంకా ఎక్కువ. విటమిన్ డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేటు గ్రంధి క్యాన్సర్, క్లోమం క్యాన్సర్ల ముప్పు మరింత ఎక్కువని పలు అధ్యయనాల్లో రుజువైంది. మన దేశంలో 90 శాతం మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిఒక్కరూ ఈ అంశం మీద దృష్టి సారించాల్సిందే.
లోపిస్తే వచ్చే మార్పులు, లక్షణాలు
- శరీరానికి తగినంత విటమిన్ డి అందినప్పుడే అది కాల్షియాన్ని గ్రహించగలుగుతుంది. ఒకవేళ విటమిన్ డి లోపం తలెత్తితే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడి ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. అధికబరువున్న వారిలో ఈ మార్పు మరింత వేగంగా కనిపిస్తుంది.
- వీరిలో కండరాలూ, కీళ్ల నొప్పులూ దీర్ఘకాలం బాధిస్తాయి.
- కొందరు ఎన్ని నియమాలు పాటించినా, విశ్రాంతి తీసుకున్నా అలసటా, ఒత్తిడీ బాధిస్తాయి. అలాగే క్షణక్షణానికీ మనఃస్థితి, భావోద్వేగాలు మారిపోతాయి. తరచూ ఈ సమస్యకనిపిస్తుంటే అది విటమిన్ డి లోపం ఉందని అనుమానించాలి.
- విటమిన్ డి లోపం వల్ల శరీరానికి మేలుచేసే 'సెరటోనిన్' హార్మోన్ విడుదల కాకపోవటంతో ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది.
- వాతావరణం చల్లగా ఉన్నా తలలో చెమటలు పట్టడం, దురదగా, చిరాగ్గా అనిపిస్తుంటే విటమిన్ డి లోపం ఉన్నట్టు అనుమానించాలి .
నివారణ
- రోజూ సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో కనీసం అరగంట ఎండ తగిలేలా చూసుకోవాలి.
- రోజూ పాలూ, దానిమ్మ, నారింజ, చేపలూ, బాదం, ఆకుకూరలూ.. అధిక మోతాదులో తీసుకుంటే ఈ లోపాన్ని నివారించవచ్చు.